తిరుపతి ఆగష్టు 23.
తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్కు గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద ఘన స్వాగతం లభించింది. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ, ఐఏఎస్ మంత్రిని కలసి పూలబోకే అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతించారు. నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక నాయకులు మంత్రిని శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఎం. జయకృష్ణ మాట్లాడుతూ… తిరుపతిని రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ ఆధునీకరణ, 'గార్బేజ్ ఫ్రీ సిటీ' పారిశుధ్య చర్యలు మరియు శ్రీవారి భక్తులకు కల్పిస్తున్న మౌలిక వసతులను మంత్రికి వివరించారు.
అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ… అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి నగర పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే తాగునీరు, రోడ్ల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటిస్తూ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు

