
మన ధ్యాస ,నిజాంసాగర్, ( జుక్కల్ )
రైతుల విజ్ఞప్తి మేరకు ఖరీఫ్ పంటకు అవసరమైన సాగునీటిని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు.గురువారం నిజాంసాగర్ ప్రాజెక్టును ఆయన సందర్శించి ప్రాజెక్టులోని నీటి నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఈ ప్రవీణ్కుమార్ను ప్రస్తుత నీటి పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1400.84 అడుగుల నీటిమట్టంతో 12.284 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు.నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో ఇప్పటికే వరి నాట్లు వేసుకున్న రైతులకు ఇబ్బందులు కలగకుండా ఖరీఫ్ పంటకు అవసరమైన నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పోచారం తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు సాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ పంటలను కాపాడుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు అవసరమైన సమయంలో సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఖరీఫ్ పంటకు నిజాంసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి బాన్సువాడ నియోజకవర్గ రైతుల తరఫున పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అలాగే బాన్సువాడ నియోజకవర్గంలోని నాన్-కమాండింగ్ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న సిద్ధాపూర్ రిజర్వాయర్ రివైజ్డ్ శాంక్షన్కు అంగీకారం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరి, సర్పంచ్ సంకు లక్ష్మయ్య, నాయకులు ఎజాస్, జంగం గంగాధర్, నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఈ ప్రవీణ్కుమార్, ఏఈలు సాకేత్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
