*అమరవీరుల పోరాటాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం: డిఎస్పి శ్రీనివాసరావు.
*ప్రజలకు నిరంతరం రక్షణగా నిలవడమే మహనీయులకు ఇచ్చే నిజమైన నివాళి: సీఐ జయచంద్ర.
రేణిగుంట ఆగష్టు 15. తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణ పరిధిలోని డిఎస్పి కార్యాలయం మరియు రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.
డిఎస్పి కార్యాలయం వద్ద డిఎస్పి శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించి సిబ్బందికి, ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ— "మనం నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛ వేలాది మంది స్వాతంత్య్ర సమరయోధుల నిస్వార్థ త్యాగాల ఫలితమే. మహాత్మా గాంధీ అహింసా మార్గం, అల్లూరి సీతారామరాజు వీరత్వం, భగత్ సింగ్ ప్రాణత్యాగం మనందరికీ ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ పురోగతికి, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి" అని పిలుపునిచ్చారు.
అలాగే రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ జయచంద్ర మాట్లాడుతూ— "మన జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య సేవలు, ఆంధ్ర రాష్ట్ర సాధకుడు పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల పోరాటాలు మన ప్రాంతానికి ఎంతో గర్వకారణం. అమరవీరుల ఆదర్శాలను పునాదిగా చేసుకుని, ప్రజలకు నిరంతరం రక్షణగా నిలుస్తూ బాధ్యతాయుతంగా సేవలు అందించడమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి" అని పేర్కొన్నారు.
జెండా ఆవిష్కరణ అనంతరం చిన్న పిల్లలకు, హాజరైన వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో సబ్ డివిజన్ పరిధిలోని డీఎస్పీ కార్యాలయం వద్ద డిఎస్పి శ్రీనివాసరావు, అర్బన్ పరిధిలోని పోలీస్ కార్యాలయం వద్ద సీఐ జయచంద్ర, ఎస్ఐ శ్రీనివాసులు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

