వైకాపా దుష్ప్రచారంపై నూతన ఉపాధ్యాయుల ఆగ్రహం.
పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించిన కూటమి ప్రభుత్వం.
శ్రీకాళహస్తి ఆగష్టు 14. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మెగా డీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన 36 మంది అభ్యర్థులతో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆయన నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులకు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి, జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దివ్య ప్రసాదాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న పాఠశాలల్లోని సమస్యలు, మౌలిక వసతుల అవసరాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, విద్యార్థుల భవిష్యత్తు కోసం వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. సమావేశంలో పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ గత మూడు నాలుగు రోజులుగా వైకాపా నాయకులు చేస్తున్న దుష్ప్రచారం, డ్రామా ర్యాలీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. అసలు వీరు ఎవరి కోసం ఈ ‘జెన్-జీ’ నిరసనలు చేస్తున్నారని, వీరి ర్యాలీల్లో ఒక్కరైనా నిజమైన యువత ఉన్నారా అని మండిపడ్డారని తెలిపారు. కేవలం డీఎస్సీ రాని అభ్యర్థులను రెచ్చగొట్టి, వారి నిరాశను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయ లబ్ధి పొందాలని వైకాపా చూస్తోందని అభ్యర్థులు ధ్వజమెత్తారని అన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్లుగా నిరుద్యోగులు ఎదురుచూసినా ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వకుండా నాటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖం చాటేశారని, కానీ కూటమి ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటి సంతకం పెట్టి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీని పూర్తి చేశారని బొజ్జల సుధీర్ రెడ్డి వివరించారు. ఎన్నో ఏళ్లు రేయింబవళ్లు కష్టపడి, నిద్రాహారాలు మాని చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులపై వైకాపా నేతలు విషం చిమ్ముతూ, 'డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు, లోకేష్కు ముడుపులు అందాయి' అంటూ నిరాధార ఆరోపణలు చేయడం అభ్యర్థుల కష్టాన్ని తీవ్రంగా అవమానించడమేనని, వైకాపా దిగజారుడు దుష్ప్రచారాన్ని నూతన ఉపాధ్యాయులు ముక్తకంఠంతో ఖండించారని తెలిపారు.


