
విశాఖపట్నం మన ద్యాస ప్రతినిధి ఆగస్టు 13:

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిస్తూ,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్.బి.ఐ)అమరావతి సర్కిల్,విశాఖ రీజన్ ఆధ్వర్యంలో బృహత్తర ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు.ఇందులో భాగంగా విశాఖపట్నం రీజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతోంది.ఆగస్టు 15 నాటికి విశాఖపట్నం రీజన్ వ్యాప్తంగా వేలాది మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ఎస్.బి.ఐ రీజనల్ మేనేజర్ సి.హెచ్ కృష్ణ మోహన్ ఆచారి వెల్లడించారు.ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఆరిలోవలోని'ఫస్ట్ రిఫరల్ యూనిట్'ఎఫ్ ఆర్ యూ ఆసుపత్రి ప్రాంగణంలో పలు రకాల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎఫ్.ఆర్.యు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనిత,వైద్యులు డాక్టర్ వెంకటేశ్వర్లు,డాక్టర్ కే.రాగసుధ,ఆరిలోవ ఎస్మే. బి.ఐ బ్రాంచ్ మేనేజర్ సంతోష్ తో కలిసి కృష్ణ మోహన్ ఆచారి పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ లో భాగంగా భావి తరాలకు స్వచ్ఛమైన గాలిని,పచ్చని వాతావరణాన్ని అందించడానికి మొక్కల పెంపకం ఎంతో ఆవశ్యకమని పేర్కొన్నారు.ఎస్.బి.ఐ వ్యాపార సేవలతో పాటు సామాజిక బాధ్యత తో సి.ఎస్ఆర్ నిధుల ద్వారా సమాజ సేవ చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ యూ సిబ్బంది,ఎస్బీఐ అధికారులు మరియు ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.