గాజులమండ్యం (రేణిగుంట)ఆగష్టు 13. రేణిగుంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆదేశాల మేరకు గాజులమండ్యం గ్రామ పంచాయతీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ కామరాజు మరియు మలేరియా సబ్ యూనిట్ అధికారి వెంకటయ్యల ఆధ్వర్యంలో ‘ప్రధాన మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్’ మరియు దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించగా, ఈ సందర్భంగా విద్యార్థులకు క్షయ వ్యాధి లక్షణాలు, వ్యాధి ముందస్తు గుర్తింపు విధానం, ప్రభుత్వ ఆస్పత్రులలో లభించే ఉచిత పరీక్షలు మరియు సరైన సమయంలో పూర్తి స్థాయి చికిత్స పొందడం వల్ల క్షయవ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని వివరించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ లక్ష్యాలను తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ క్షయవ్యాధి నిర్మూలనకు తమవంతు సహకారం అందించాలని కోరారు. అనంతరం డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా, బోదకాలు, మెదడు వాపు వంటి దోమల ద్వారా సంభవించే ప్రమాదకర వ్యాధుల నివారణకు ప్రణాళికాబద్ధమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని, ప్రతి ఇంట శుక్రవారాన్ని డ్రై డేగా పాటిస్తూ నీటి నిల్వగల పాత్రలను వారానికి ఒకసారి ఖాళీ చేసి శుభ్రం చేసుకోవాలని, అలాగే శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు ధరించడం మరియు దోమతెరలను ఉపయోగించడం వంటి ముందస్తు చర్యలు పాటించాలని వివరించారు. ఇకపోతే ఈ అవగాహన కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి వెంకటయ్య, ఎఎన్ఎం సుభాషిణి, హెల్త్ అసిస్టెంట్ మునివెంకటప్ప, ఎమ్ఎల్హెచ్పీ తేజలతో పాటు ఆశాకార్యకర్తలు చాముండేశ్వరి, సరస్వతి, సరోజిని, రేచల్, శిరీష మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

