కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) శారదా దేవి.
తిరుపతి ఆగష్టు 11. స్వర్ణాంధ్ర మరియు 2047 లక్ష్యాల సాధనలో భాగంగా తిరుపతి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ప్రణాళికకు అధికారులు అందరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) శారదా దేవి తెలిపారు. తిరుపతి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించే అంశాలపై కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ కార్యక్రమం మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శారదాదేవి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సి.వి.ఏ.పి.బృందం పాల్గొన్నారు. పెహలా ఇండియా ఫౌండేషన్ కోఆర్డినేటర్లు సౌరబ్, శిరీష మరియు వారి బృందం అధికారులకు శిక్షణ అందించారు. తిరుపతి నియోజకవర్గంలోని సేవారంగం, పర్యాటకం ఉద్యానవనం, పరిశ్రమలు,వ్యవసాయం, పశుసంపద, తదితర రంగాల అభివృద్ధి సామర్థ్యాలను గుర్తించి, వాటి ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. నాణ్యమైన డేటా ఆధారంగా నియోజకవర్గ అభివృద్ధి ప్రాధాన్యతలను నిర్ణయించి, ఉపాధి అవకాశాల పెంపు, ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, వ్యవసాయ అభివృద్ధి, సేవారంగ విస్తరణ మరియు మౌలిక సదుపాయాల మెరుగుదలకు కీలకంగా పనిచేయాలని తెలిపారు. శిక్షణలో జి.డి.డి.పి., జి.ఎం.డి.పి., డేటా సేకరణ, డేటా విశ్లేషణ, రంగాల వారీ అభివృద్ధి అవకాశాల గుర్తింపు, స్థానిక వనరుల వినియోగం, శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణా కార్యక్రమం లో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్టాటిస్టికల్ ఆఫీసర్ వేంకటరామిరెడ్డి, సి.వి.ఏ.పి. బృందం మరియు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

