తిరుపతి ఆగస్టు 02: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తిలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పోలీసు సిబ్బంది మరియు మీడియా ప్రతినిధుల కుటుంబ సభ్యుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.తిరుపతి డీఎన్ఆర్ హాస్పిటల్ వైద్యుల బృందం సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వైద్య సలహాలు, ఆరోగ్య సూచనలు అందించారు. కార్యక్రమానికి హాజరైన వారు ఈ సేవలను వినియోగించుకుని వైద్యుల సూచనలు పొందారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి (లా అండ్ ఆర్డర్) వారు పాల్గొని వైద్య శిబిరాన్ని పరిశీలించారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, మీడియా ప్రతినిధుల సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు మాట్లాడుతూ, పోలీసు–ప్రజల మధ్య సత్సంబంధాలు బలోపేతం చేయడంతో పాటు పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. డీఎన్ఆర్ హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్య బృందానికి ఈ సందర్భంగా జిల్లా పోలీసు శాఖ కృతజ్ఞతలు తెలిపారు.

