రేణిగుంట:
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని రేణిగుంట సీఐ జయచంద్ర హెచ్చరించారు. రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తిరుపతి స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది.
పోలీసు తెలిపిన వివరాల ప్రకారం... వడమాలపేటకు చెందిన జి. మస్తాన్ (25, తండ్రి: చిన్నబాబు) మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడటంతో, ఆయనపై మోటారు వాహనాల చట్టం సెక్షన్ 185(ఎ ) ప్రకారం కేసు ( ఎస్ టి సి నెం.: 3191/2026) నమోదు చేశారు. విచారణలో భాగంగా నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, అతడు తన నేరాన్ని అంగీకరించాడు.
దీంతో విచారణ చేపట్టిన గౌరవ మేజిస్ట్రేట్ నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ రూ.10,000/- జరిమానా విధించడంతో పాటు, 7 రోజుల సాధారణ కారాగార శిక్ష (సింపుల్ ఇంప్రిజన్మెంట్) ఖరారు చేసినట్లు సీఐ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని, ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా పోలీసులు విజ్ఞప్తి చేశారు
