
అమరావతి జూలై 28, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉదయగిరి ప్రాంత ప్రత్యేకతను ప్రతిబింబించే సాంప్రదాయ కళాఖండాలను ముఖ్యమంత్రికి ఆప్యాయంగా బహుకరించారు. స్థానిక కళాకారుల ప్రతిభను, వారి నైపుణ్యాన్ని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందేలా ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.అనంతరం ఉదయగిరి నియోజకవర్గ సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఉదయగిరి ప్రాంతంలో ఎంతో మంది మహిళలకు జీవనాధారంగా నిలిచిన వుడ్ కట్లరి పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ పరిశ్రమలో సుమారు 300 మంది మహిళలు తమ నైపుణ్యంతో కళాఖండాలను తయారు చేస్తూ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని వివరించారు. ఈ పరిశ్రమను మరింత విస్తరించి, ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసి, మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించడం ద్వారా వందలాది మంది యువతకు, మహిళలకు అదనపు ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను కూడా ఎమ్మెల్యే గారు వివరించారు. ప్రకృతి సంపద, చారిత్రక విశిష్టత, స్థానిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకొని పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించడంతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.అలాగే నియోజకవర్గంలోని ఇరిగేషన్ (జలవనరుల శాఖ) పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సాగునీటి వసతుల మెరుగుదల, రైతులకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రితో సమగ్రంగా చర్చించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టవలసిన విధివిధానాలు, పార్టీ బలోపేతం, ప్రజలతో మరింత సమన్వయం పెంపొందించే అంశాలపై కూడా సుదీర్ఘంగా అభిప్రాయాలుపంచుకున్నారు.ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వినిపించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రద్ధగా ఆలకించి, ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, స్థానిక కళాకారులు, మహిళా ఉపాధి, పరిశ్రమల అభివృద్ధి, పర్యాటక రంగ ప్రోత్సాహం మరియు సాగునీటి ప్రాజెక్టుల పురోగతికి అవసరమైన చర్యలు తీసుకునే దిశగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.