
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, విద్యాశాఖ మంత్రివర్యులు, నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్.
అమరావతి జూలై 28, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉదయగిరి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన సాంప్రదాయ వుడ్ కట్లరీ కళాఖండాలను అందజేసి, ఆ కళకు ఉన్న విశిష్టతను వివరించారు.అనంతరం ఉదయగిరి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రి నారా లోకేష్ తో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సుదీర్ఘంగా చర్చించారు.ముఖ్యంగా ఉదయగిరి వుడ్ కట్లరీ పరిశ్రమలో ప్రస్తుతం సుమారు 300 మంది మహిళలు తమ నైపుణ్యంతో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారని, ఈ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ సౌకర్యాలు, శిక్షణ కార్యక్రమాలు కల్పించడం ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉందని వివరించారు. ఈ పరిశ్రమను రాష్ట్ర స్థాయిలో ప్రోత్సహించి, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ ని కోరారు.అలాగే ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా, పర్యాటక రంగంలో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సహజ వనరులు, చారిత్రక ప్రదేశాలు, పర్యాటక అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకురావడానికి అవసరమైన చర్యలపై చర్చించారు.ఈ సందర్భంగా జలవనరుల శాఖ ఆధ్వర్యంలో చేపట్టవలసిన ఇరిగేషన్ అభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టులు, రైతులకు మేలు చేసే కార్యక్రమాల అమలు, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల సమన్వయం, ప్రజల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు.ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ని కోరారు.