
భక్తుల పాలిట కొంగు బంగారం మానసా దేవి..అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు..
వరికుంటపాడు జూలై 10 , మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
భక్తుల పాలిట కొంగు బంగారం గా శ్రీ మానసా దేవి అమ్మవారు కాపు కాస్తూ ప్రజలను వెన్నంటి ఉందని ఇక్కడి ప్రాంత ప్రజల నమ్మకం.... వరికుంటపాడు మండల పరిధిలోని తూర్పు రొంపి దొడ్ల గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ మానసా దేవి అమ్మవారి ఆలయంలో 12వ వార్షికోత్సవం సందర్భంగా మూడవరోజు ఉదయం నుంచి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం,మండపారాధనలు, సర్వతోభద్ర ఆరాధనలు, 108 కలిశాలతో పవిత్ర జల ఆవాహన, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట, గణపతి, మానసా దేవి, సౌర హోమాలు నిర్వహించారు. సాయంత్రం పంచసూక్త హోమాలు, పాయచిత్త హోమాలు, చతుర్వేద హోమాలు, రుద్ర హోమాలు, వాస్తు హోమాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చినటువంటి భక్తులందరికీ ఆలయ అర్చకులు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాదాలు పంచిపెట్టారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్, టిడిపి మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వారికి ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సకాలంలో వర్షాలు పడాలని రైతులు పాడి పంటలతో తులతూగాలని అమ్మవారిని వేడుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను, చండ్రా మధుసూదన్ రావు ను, జడ్పిటిసి రావెళ్ల నాగేంద్ర ను,సొసైటీ అధ్యక్షులు గుర్రం గోపిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ ఉత్సవాలు చల్లా వంశస్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చేటువంటి భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయాన్ని పలు రకాల పుష్పాలతోనూ విద్యుత్ దీపాలతోనూ సుందరంగా అలంకరించారు.