
మన ధ్యాస, కందుకూరు, జూలై 4 :కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి చైర్ పర్సన్ గా రాయపాటి సుభాషిని, మరో 15 మంది డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం కందుకూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఘనంగా నిర్వహించారు. నాయకులు,కార్యకర్తలు మధ్య ఎమ్మెల్యే నాగేశ్వరావు కేక్ కట్ చేశారు..ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి ఏఎంసీ ప్రాంగణం వరకు జరిగిన ర్యాలీలో తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఏఎంసి చైర్ పర్సన్ రాయపాటి సుభాషిని తదితరులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబూ జగజీవన్ రామ్, పూలే విగ్రహాలకు ఎమ్మెల్యే ఇంటూరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ఎమ్మెల్యే నాగేశ్వరరావును గుర్రంపై ఊరేగించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి ర్యాలీ మొదలైంది. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు మరియు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, నియోజకవర్గ పరిశీలకురాలు శ్రావణి రెడ్డి, ఏఎంసి చైర్ పర్సన్, డైరెక్టర్లు, మండల పార్టీల అధ్యక్షులు ప్రత్యేక వాహనంపై నిలబడి, దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తీన్మార్, డప్పులు, తప్పెట్లు, గుర్రాల సందడి.. జెండాలు చేతబట్టి రోడ్డుకు ఇరువైపులా నడిచివెళ్లే కార్యకర్తల నినాదాలు... యువత డ్యాన్సులు, ఈలలు... టపాసుల మోతలు... మొత్తంగా ర్యాలీ జరిగిన 2 కిలోమీటర్ల దూరం జనంతో కిక్కిరిసిపోయింది. మధ్యలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద, ఒంగోలు డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నేతలకు గజమాలతో స్వాగతం పలికారు.కందుకూరు పట్టణంతో పాటు రూరల్ మండలం, వలేటివారిపాలెం, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లోని మూడు పార్టీల నేతలు, అనుబంధ సంఘాల సభ్యులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు ర్యాలీ వెంట నడిచారు. ముఖ్యంగా ర్యాలీలో సగభాగం మహిళలే ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. యువకులు కూడా డాన్సులు వేస్తూ ఉత్సాహం ప్రదర్శించారు. కందుకూరు నియోజకవర్గ చరిత్రలో దళిత ఎస్సీ మహిళ, కందుకూరు మండలం ఓగూరు గ్రామానికి చెందిన రాయపాటి సుభాషిని ని ఏఎంసి చైర్ పర్సన్ గా నియమిస్తూ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నిర్ణయం తీసుకోవడం, దానికి అనుగుణంగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో... అన్ని గ్రామాల నుంచి దళితులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చారు. దళితులకు పెద్దపీట వేస్తూ, చైర్ పర్సన్ గా అవకాశం కల్పించినందుకు వారంతా ఎమ్మెల్యే నాగేశ్వరావు కలిసి సంతోషంతో కృతజ్ఞతలు తెలియజేయటం స్పష్టంగా కనిపించింది. ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పలువురు దళిత నాయకులు హాజరై ప్రమాణ స్వీకారాన్ని తిలకించారు. అనంతరం ఎమ్మెల్యేని ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.






