
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో ప్రజలు,దాతలు భాగస్వాములు కావాలని, విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని భవిష్యత్కు సిద్ధం కావాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.
నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఎన్ఆర్ఐ, కాంగ్రెస్ నాయకుడు భుజంగారి భాస్కర్ రెడ్డి రూ.84 వేల విలువైన నూతన కంప్యూటర్ను విరాళంగా అందించారు.ఈ కంప్యూటర్ను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కంప్యూటర్ పరిజ్ఞానం ప్రతి విద్యార్థికి ఎంతో అవసరమని అన్నారు. ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంపొందించుకుంటే ఉన్నత విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ..విద్యార్థుల అభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని అన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.కళాశాల ప్రిన్సిపాల్ అసద్ ఫరూక్ బహ్మది విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపయోగపడే కంప్యూటర్ను అందించిన భుజంగారి భాస్కర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు యూనిస్ పటేల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రజా పండరి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సంకు లక్ష్మయ్య, కేతావత్ నారాయణ, వడ్ల బ్రహ్మం, గుర్రపు శ్రీనివాస్, బంగ్లా ప్రవీణ్ కుమార్, చాకలి సాయిలు,అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
