
జియ్యమ్మవలస /మనధ్యాస/(ప్రతినిధి) జూన్ 27:-- కొమరాడ మండలం చిన్నఖేర్జల గ్రామ పంచాయతీ పరిధిలోని మధుర గ్రామమైన లింగాన్నడోరావలసలో మలేరియా వ్యాధి నిర్ధారణ కావడంతో మండల యంత్రాంగం, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఈ గ్రామంలో జిల్లా పరిపాలనాధికారి ఆదేశాల మేరకు శనివారం మా ఊరికి మలేరియా వచ్చింది' అనే ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మండల పరిషత్ అభివృద్ధి ఎస్. రమేష్ తెలిపారు.
గ్రామస్తులందరి భాగస్వామ్యంతో దోమల లార్వా వేట ఆవశ్యకతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా గ్రామం వెలుపల కిలోమీటరు పరిధిలో వాగు పండుగ క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి లార్వా కోసం ముమ్మరంగా అన్వేషించారు. సమీపంలోని సెలయేరులో మలేరియా వ్యాప్తికి కారణమయ్యే అనాఫిలిస్ దోమల వృద్ధిని అధికారులు గుర్తించారు.
ఈ సందర్భంగా ఎస్ ,రమేష్ మాట్లాడుతూ. దోమల పెరుగుదలను అరికట్టేందుకు ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, మలేరియా విభాగం అధికారులు, చిన్నఖేర్జల గ్రామ సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.