
తవణంపల్లె, జూన్ 26 మనద్యాస(నాగరాజ. ఎస్ )
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అర్ధగిరి వీరాంజనేస్వామి దేవస్థానంఅభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న గిరి ప్రదక్షణ రోడ్డుకు శుక్రవారం లాంచనంగా భూమిపూజ చేసి జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం ఆదేశాల మేరకు అర్ధగిరి ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం అవుతున్న విషయం విధితమే. ఈమేరకు అర్ధగిరి ఆలయ దర్శనార్థం వచ్చే భక్తులకు కావలసిన వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు దేవస్థానం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జరుగనున్నాయి. ఈమేరకు ఇప్పటికే దేవస్తానం అభివృద్ధిపై ఆలయ చైర్మన్ రఘుపతి, ఈఓ మునిశేఖర్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలెక్టర్ గత నెల రోజుల క్రితం సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఇందులో భాగంగా అర్ధగిరి ఆలయం చుట్టూ గిరి ప్రదక్షణ కోసం రోడ్డును నిర్మించాలని సమావేశంలో ప్రతిపాదించారు. ఈమేరకు పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షణకు అవసరమైన సుమారు 13 కిలోమీటర్లు రోడ్డును నిర్మించడానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ముందుగా రోడ్డు సర్వే చేయడానికి వీలుగా జంగి క్లియరెన్స్ పనులను శుక్రవారం ప్రారంభించారు. అర్ధగిరి క్షేత్రంలో ప్రత్యేకపూజలు నిర్వహించిన అనంతరం పనులను ప్రారంభించారు. ఉదయం ఆలయం సమీపంలో దేవస్థానం చైర్మన్ పైమాఘం రఘుపతి, ఈఓ మునిశేఖర్ల ఆధ్వర్యంలో రోడ్డు పనులను పూజలు చేసి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటేష్ చౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, పలువురు నాయకులు, పాలకమండలి సభ్యులు, అర్చకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.