
కరీంనగర్ ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం.
కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల సాయం.
కలిగిరి ,జూన్ 25, గురువారం,మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
కలిగిరి మండలం కుమ్మరకొండూరు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన పంతగాని చరణ్ తేజ, వేల్పుల గోపి ఉపాధి నిమిత్తం కరీంనగర్కు వెళ్లి ఉండగా, ప్రమాదవశాత్తు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాదకర సంఘటన స్థానిక నాయకుల ద్వారా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ దృష్టికి చేరింది.ఈ దుర్ఘటన పట్ల ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల రూపాయల చొప్పున తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేయించారు.ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ నోటి మల్లికార్జున రెడ్డి, కాపుగొర్ల మురళి తదితరులు పాల్గొని, బాధిత కుటుంబాలను పరామర్శించి తమ సానుభూతిని వ్యక్తం చేశారు.మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ తీవ్ర విషాదాన్ని భరించే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రార్థించారు.
