తిరుపతి జూన్ 25.
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక భారీ ఇంటి దొంగతనం కేసును పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే అత్యంత ప్రతిభావంతంగా ఛేదించారు. ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.93,00,000/- విలువైన పూర్తి చోరీ సొత్తును రికవరీ చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ ఏ. శ్రీనివాసులు (పరిపాలన) మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ నెల 24న తిరుపతి రూరల్ మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీమతి కె.ఆర్. యశోదమ్మ అనే మహిళ ఇంట్లో లేని సమయంలో నిందితులు చొరబడ్డారు. బీరువాను పగలగొట్టి, అందులోని 600 గ్రాముల బంగారు ఆభరణాలు, 1½ కిలోల వెండి వస్తువులు, రూ.50,000/- నగదు కలిగిన గోద్రేజ్ లాకర్ను అపహరించుకెళ్లారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. గురువారం (25-06-2026) ఉదయం తిరుపతి–చంద్రగిరి బైపాస్ రోడ్డులోని చెర్లపల్లి సర్కిల్ వద్ద ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. ప్రధాన నిందితురాలు పూజారి సోనియా (ఎ 1) బాధితురాలికి సమీప బంధువు. గతంలో ఆమె ఆ ఇంట్లోనే నివసించడంతో, ఆభరణాలు ఎక్కడ ఉంటాయో పూర్తి అవగాహన కలిగి ఉంది. ఈ క్రమంలోనే ఆమె ముందస్తు పథకం ప్రకారం నంద్యాల బాబు (ఎ 2), ఐలోని అనిత (ఎ 3) లతో కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు అంగీకరించింది. నిందితుల నుండి చోరీకి వాడిన స్కూటర్తో పాటు, లాకర్లోని పూర్తి ఆభరణాలు, నగదును పోలీసులు భద్రంగా రికవరీ చేశారు.
కేసును రికార్డు స్థాయిలో 24 గంటల్లోనే ఛేదించి, వంద శాతం సొత్తును రికవరీ చేసిన చంద్రగిరి డీఎస్పీ బి. ప్రసాద్, తిరుపతి రూరల్ సీఐ మద్దయ్యాచారి, ఎస్ఐలు, సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు ప్రత్యేకంగా అభినందించి, వారికి ప్రశంసా పత్రాలు, రివార్డులను ప్రకటించారు.


