రేణిగుంట:
రేణిగుంటలోని కేఎల్ఎం సర్కిల్ సమీపంలో మున్నూరు వెంకటరమణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'ఎస్ఆర్ఎమ్ విద్యాసంస్థ' ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామీజీ వారి దివ్య సాన్నిధ్యంలో, వారి పవిత్ర హస్తాల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ శుభసందర్భంలో పూజ్య గురుదేవుల ఆశీస్సులు అందుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘనమైన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తో పాటు కూటమి ముఖ్య నాయకులు, పలువురు ప్రముఖ విద్యావేత్తలు మరియు స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ .. సమాజ నిర్మాణంలో మరియు యువత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విద్య పాత్ర అత్యంత కీలకమైనదని అభిప్రాయపడ్డారు. విద్యా వ్యాప్తి కోసం నిరంతరం కృషి చేస్తూ, ఈ ప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్న మున్నూరు వెంకటరమణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధులను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందించడం జరిగింది. సమాజ శ్రేయస్సు కోసం వారి విద్యా సేవలు మున్ముందు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని, విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

