
నెల్లూరు , జూన్ 16, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
దుత్తలూరులో రూ.2,500 కోట్లతో 5 పరిశ్రమలు – యువతకు భారీ ఉద్యోగావకాశాలు..!
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే కాకర్ల సురేష్.నెల్లూరు నగరంలోని కస్తూరి దేవి గార్డెన్స్లో కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన "రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం (మీ భూమి – మీ హక్కు)" కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, అతిరథ మహారథులతో కలిసి గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ,,రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుందని, ఈ రెండు సంవత్సరాల కాలంలో అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువచ్చిందని తెలిపారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి కలిగిన నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారం, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రివర్యులు నారా లోకేష్ ప్రత్యేక చొరవతో రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా దూసుకుపోతోందని పేర్కొన్నారు.

.ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందని, గత రెండేళ్లలోనే సుమారు రూ.650 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వివరించారు. రహదారులు,తాగునీటి సదుపాయాలు, పర్యాటక అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి వంటి అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించామని తెలిపారు.అలాగే దుత్తలూరు మండలంలో 1,400 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,500 కోట్ల పెట్టుబడులతో ఐదు భారీ పరిశ్రమలను స్థాపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని, నిరుద్యోగ యువత భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో నర్రవాడ దేవాలయ అభివృద్ధికి రూ.12 కోట్లు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేలా ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలతో ప్రతి పంచాయతీలో సీసీ రోడ్ల నిర్మాణం, చెరువుల ఆధునీకరణ, సాగునీటి వనరుల అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

గ్రామీణాభివృద్ధి మరియు ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందనిఅన్నారు.అంతేకాకుండా వి.పి.ఆర్ ఫౌండేషన్ మరియు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, సామాజిక సేవా కార్యక్రమాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తున్నామని తెలిపారు.ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, మౌలిక వసతులు మరియు సామాజిక న్యాయం అనే ఐదు స్తంభాలపై కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఉదయగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.