
సాలూరు మన ధ్యాస ప్రతినిధి :- ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలతో కూడిన మ్యానిఫెస్టోని రూపొందించి అధికారం లోకి వచ్చాక కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను వంచన చేసిందని మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు.శుక్రవారం వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం లో భాగంగా సాలూరు లో వైకాపా కార్యాలయం నుండి మెయిన్ రోడ్ మీదుగా భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు.సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మహిళలకు ఆడబిడ్డనిధి,నిరుద్యోగ భృతి,50 సంవత్సరాలకే ఫించన్,మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు,అన్నదాత సుఖీభవ పథకం క్రింద ఏడాదికి ఇరవై వేలు,ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అంటూ అబద్ధపు హామీలు ఇచ్చి వీటిలో ఏ ఒక్కటి అమలుచేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘన చరిత్ర కూటమి ప్రభుత్వానిది అని ఎద్దేవా చేసారు.6 లక్షల ఉద్యోగాలు కల్పించామని కూటమి ప్రభుత్వం ప్రకటిస్తుందని దీనికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయమని డిమాండ్ చేస్తున్నానన్నారు.నూతనంగా ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయని కూటమి ప్రభుత్వం ఐదు లక్షల ఇండ్లు మంజూరు చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యీగులకు ఐఆర్,డిఎ బకాయిలు,పిఆర్సీ అందిస్తామని హామీ గుప్పించి నేడు ఉద్యోగులకు మొండి చేయి చూపారన్నారు.మంత్రి సంధ్యారాణి మొదటి సంతకమే నేటివరకు అమలుకు నోచుకోలేదన్నారు.డిఎస్సీ అక్రమాలు జరగాయని వైకాపా ఆరోపిస్తుంటే కూటమి ప్రభుత్వం జరగలేదంటుందని అలాంటప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేసి తమ తప్పులేదని ప్రభుత్వం నిరూపించుకోవాలని సవాల్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఉన్నా సున్నీ వడ్డీకే మహిళలకు ఋణాలు,రైతుభరోసా,చేయూత,ఉచిత పంటలభీమా వంటి పథకాలు నిలుపుదల చేయడం దుర్మార్గమన్నారు.రైతుకు మద్ధతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు.రైతులకు స్మార్ట్ మీటర్లు పెడితే ఊరుకునేది లేదని గత ప్రభుత్వం హయాంలో నానా హడావుడి చేసిన లోకేష్ బాబు,నేడు స్మార్ట్ మీటర్లను బలవంతంగా అమర్చితే నోరెత్తడం లేదన్నారు.గతంలో బాదుడే బాదుడు అని ప్రతీ గడపకు ప్రచారం చేసిన సంధ్యారాణి నేడు నిత్యవసరాలు,కరెంట్,గ్యాస్,పెట్రోల్ ఛార్జీలు గణనీయంగా పెరిగిన గమ్మున ఉంటున్నారన్నారు.అంతేకాకుండా రాష్ట్రంలో అవినీతి,అరాచక పాలన అధికమయిందన్నారు.ప్రశ్నిస్తున్న వారిపై అకారణంగా కేసులు పెడుతున్నారన్నారు.ఈ నిరసన ర్యాలీలో సీనియర్ నాయకులు మావుడి శ్రీనివాసనాయుడు,రంగునాయుడు,డోలబాబ్జి,దండి శ్రీనివాసరావు,రెడ్డి పద్మావతి, పాచిపెంట ఎంపిపీ బడ్నాన ప్రమీల,సువ్వాడ భరత్ శ్రీనివాస్,సువ్వాడ రామకృష్ణ, బంకురు తిరుపతినాయుడు,తదితరులు పాల్గొన్నారు .
