మన న్యూస్:భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇల్లందు డిఎస్పి చంద్రభాను సూచనలతో గుండాల పోలీసుల ఆధ్వర్యంలో అడవిరామవరం గుత్తి కోయ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తో పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి. సాయి మనోహర్,ఇల్లందు డిఎస్పీ చంద్రభాను లు పాల్గొన్నారు.ఆళ్లపల్లి మండలం అడవిరామవరంలో చత్తీస్గడ్ రాష్ట్రం నుండి వలస వచ్చి కొన్నేళ్ళుగా నివాసముంటున్న ఆదివాసీలకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ తెలియజేసారు. ఇందులో భాగంగా ముందుగా గ్రామంలో నివసించే కుటుంబాలకు వైద్య బృందంతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ముందుగా ఆళ్లపల్లి మీదుగా మర్కోడు చేరుకొని అక్కడ నుండి ద్విచక్ర వాహనాలపై దట్టమైన అటవీ ప్రాంతంలో నుండి అధికారులు అడవిరామవరం గ్రామానికి చేరుకోవడం జరిగింది. అక్కడికి చేరుకున్న ఎస్పీ ముందుగా గ్రామ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.అనంతరం గ్రామ ప్రజలకు ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్, గుండాల పోలీస్ వారి సహాకారంతో దుప్పట్లు,సోలార్ లైట్లను, నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే వలస ఆదివాసీ ప్రజల అభివృద్ధి కోసం పోలీస్ శాఖ ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ కృషి చేస్తుందని తెలిపారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.గ్రామంలోని యువత,పిల్లలు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించి మెరుగైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదని సూచించారు.మావోయిస్టులు వారి స్వార్ధ ప్రయోజనాల కోసం ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకొని ఆదివాసి ప్రజలను కనీస సౌకర్యాలకు దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత మావోయిస్టులకు మనుగడ లేక మావోయిస్టు పార్టీ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని తెలియజేశారు.ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానిక పోలీసు అధికారులకు తెలియజేసి వాటిని పరిష్కరించుకోవాలని గ్రామ ప్రజలకు తెలియజేశారు.అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న 120 మంది గ్రామ ప్రజలకు ఏర్పాటు చేసిన సహాపంక్తి విందులో అధికారులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన గుండాల సీఐ రవీందర్, టేకులపల్లి సీఐ సురేష్, ఎస్సైలు రాజమౌళి,రతీష్, శ్రీకాంత్, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.వైద్య సేవలు అందించడానికి వచ్చిన వైద్యురాలు సంఘమిత్ర సుదీప్బృం దానికి, ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సభ్యులు సొందు పాషా కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు.