శ్రీకాళహస్తి:
తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ ‘మహానాడు–2026’ వేడుకలు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహానాడు పసుపు పండుగను పురస్కరించుకుని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈరోజు ఉదయం శ్రీకాళహస్తిలోని తన నివాసంపై పార్టీ పసుపు జెండాను గర్వంగా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు మరియు కార్యకర్తలకు మహానాడు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం నిద్ర లేవగానే తన మొదటి బాధ్యతగా నివాసంపై పార్టీ జెండాను ఎగురవేయడం జరిగిందని పేర్కొన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక అయిన పసుపు జెండా కేవలం ఒక జెండా మాత్రమే కాదని, అది కోట్లాది మంది కార్యకర్తల నమ్మకానికి, ప్రజా సంక్షేమానికి నిదర్శనమని ఆయన కొనియాడారు.
సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు
పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆశయాలను స్మరించుకుంటూ, 'సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు' అనే సిద్ధాంతంతోనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజల రక్షణే ధ్యేయంగా సాగుతున్న ఈ పాలనలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పార్టీ బలోపేతం కోసం మరియు ప్రజా సంక్షేమ పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నాయకులు, కార్యకర్తలు అంతా సమిష్టిగా కదలిరావాలని ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు.


