తుడా చైర్మన్గా విజయవంతంగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా, నగరంలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులతో తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై, వారి గౌరవార్థం ఒక "ఆత్మీయ విందు" ఏర్పాటు చేశారు.
ఈ ప్రత్యేక ప్రెస్ మీట్లో ఆయన మీడియా ప్రతినిధులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు.
గత 365 రోజులుగా తుడా సాధించిన విజయాలను, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో మీడియా పాత్ర ఎనలేనిదని తెలిపారు.
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజలకు చేరవేయడంలో విలేకరులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు.
తుడా పరిధిలో జరిగిన ప్రతీ మంచి పనిని ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతీ ఒక్క పాత్రికేయ మిత్రునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
రాబోయే రోజుల్లో కూడా తుడా ను రాష్ట్రంలోనే అత్యుత్తమ సంస్థ గా తీర్చిదిద్దే ప్రయాణంలో మీడియా తగిన సలహాలు, సూచనలు అందించాలని కోరుతున్నట్టు తెలిపారు.
తుడా కార్యకలాపాలలో పారదర్శకతను పెంచడానికి విలేకరుల స్పందన ఎంతో ముఖ్యమని,భవిష్యత్తులోనూ ఇదే విధమైన ఆత్మీయ బంధం, సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు.
ప్రెస్ మీట్ అనంతరం చైర్మన్ విలేకరులందరినీ వ్యక్తిగతంగా కలిసి, కుశలప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అందరికీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.
ప్రెస్ కాన్ఫరెన్స్లో అధికారిక అంశాలను పంచుకున్న చైర్మన్,ఆత్మీయ విందులో విలేకరులతో ఎంతో స్నేహపూర్వకంగా, అనధికారికంగా ముచ్చటించడంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో తిరుపతి నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్టులు, వివిధ పత్రికల బ్యూరో చీఫ్లు, రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు, వీడియో జర్నలిస్టులు మరియు తుడా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


