శ్రీకాళహస్తి / రేణిగుంట:
శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఈరోజు తిరుపతి విమానాశ్రయంలో కర్ణాటక రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకుని తిరుగుప్రయాణమవుతున్న శివకుమార్ కి విమానాశ్రయంలో బొజ్జల సుధీర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా డి.కె. శివకుమార్ తో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాసేపు ముచ్చటించారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్ర విశిష్టతను, రాహు-కేతు పూజల ప్రాముఖ్యతను మరియు ఆ ముక్కంటి మహిమలను వారికి వివరించారు. ఎమ్మెల్యే మాటలను వారు ఎంతో ఆసక్తిగా ఆలకించారు.
అనంతరం, శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దివ్య తీర్థప్రసాదాలను, స్వామి వారి పవిత్ర చిత్రపటాన్ని డి.కె. శివకుమార్ కి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆత్మీయంగా అందజేశారు. ఆ కాళహస్తీశ్వరుని ఆశీస్సులు శివకుమార్ కి ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.


