రేణిగుంట లో ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి!!
భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, "కమ్యూనిస్టు గాంధీ"గా పేరొందిన పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయన చిత్రపటానికి నారాయణ, దస్తగిరి కలిసి పూలమాల వేసి సిపిఎం కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. "రెడ్ సెల్యూట్" కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య.. మీ ఆశయాలను సాధిస్తాం. అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి హరినాథ్ మాట్లాడుతూ.. కామ్రేడ్ సుందరయ్య 1913, మే 1న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, విడవలూరు మండలం, అలగానిపాడు గ్రామంలో జన్మించారు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు 1930లో చదువును మధ్యలోనే వదిలి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) CPI(M) వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. 1964 నుండి 1978 వరకు ఆ పార్టీకి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. జీవితాంతం నిరాడంబరంగా జీవించి, పేదలు, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పోరాడారు.స్ఫూర్తిదాయక జీవితంసుందరయ్య ప్రజల మనిషిగా, సమసమాజ స్థాపన కోసం తన ఆస్తిపాస్తులను సైతం త్యజించి ప్రజల కోసం అంకితమైన మహనీయుడు. ఆయన చేసిన త్యాగాలు మరియు పాటించిన విలువలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఐదు మంది కొత్త కార్యకర్తలకు ఆక్సిలరీ నుండి క్యాండిడేట్ సభ్యత్వం ను భారతి, సులోచన, పద్మమ్మ, నారాయణ, దస్తగిరి లకు ఇవ్వడం జరిగిందని పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.
ఈ కార్యక్రమంలో రేణిగుంట టౌన్ సిపిఎం పార్టీ కార్యదర్శి కె.ఈశ్వరమ్మ, భారతి, సులోచన, లక్ష్మమ్మ, పద్మమ్మ, మహాలక్ష్మమ్మ, నారాయణ, దస్తగిరి, ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.

