రేణిగుంట మే 18.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సైబర్ నేరాలు, మహిళల భద్రత, గొలుసు దొంగతనాలు మరియు మొబైల్ చోరీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, రేణిగుంట డిఎస్పి శ్రీనివాసరావు సూచనలతో అర్బన్ సిఐ జయచంద్ర ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా సిఐ జయచంద్ర మాట్లాడుతూ ప్రయాణికులు రద్దీ ప్రాంతాల్లో తమ బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్ ప్రతి ఒక్కరూ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని, ఆపద సమయంలో పోలీసుల సహాయం తీసుకోవాలని కోరారు.
సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ వివరాలు మరియు ఓటీపీలు అపరిచితులకు చెప్పకూడదని హెచ్చరించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్కు కాల్ చేయాలని, మొబైల్ ఫోన్లు పోగొట్టుకుంటే సీఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు ప్రయాణికులు పాల్గొన్నారు.

