రేణిగుంట మే 17.
స్థానిక రేణిగుంట – కోడూరు ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర తెలిపారు. గొల్లపల్లి కూడలి వద్ద ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాహనం అదుపు తప్పి కింద పడిపోవడంతో సదరు వ్యక్తి తలకు బలమైన గాయమైందని ఆయన పేర్కొన్నారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం అమర వైద్యశాలకు తరలించారని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సీఐ వెల్లడించారు. ప్రమాద సమయంలో బాధితుడు మద్యం సేవించి ఉండవచ్చని, ఆ కారణంగానే వాహనంపై నియంత్రణ కోల్పోయి పడిపోయి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన వివరించారు.
ప్రమాదానికి గురైన వాహనం (సంఖ్య AP 03 AW 2507) వివరాల ఆధారంగా విచారించగా, యజమానులు ఆ వాహనాన్ని ఫైనాన్స్ నిమిత్తం ఇతరులకు అప్పగించినట్లు తెలిసిందని, ప్రస్తుతం ఆ వాహనాన్ని వాడుతున్న వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందని సీఐ పేర్కొన్నారు. బాధితుడిని గుర్తించిన వారు లేదా బంధువుల సమాచారం తెలిసిన వారు వెంటనే రేణిగుంట రక్షక భట నిలయంలో సంప్రదించాలని కోరారు.
