శ్రీకాళహస్తి: తొట్టంబేడు మండలం, సిద్ధిగుంట గ్రామానికి చెందిన ముగ్గురు అనాథ ఆడబిడ్డలకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కొండంత అండగా నిలిచారు. అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి చెందడంతో దిక్కులేని వారైన ఆ చిన్నారుల బాధ్యతను తాను స్వీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.
సిద్ధిగుంట గ్రామానికి చెందిన రాజేశ్వరి, రమేష్ దంపతులు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వీరి ముగ్గురు కుమార్తెలు కుమారి, జ్ఞానదీప్తి మరియు వర్షిణి ప్రస్తుతం వృద్ధురాలైన నానమ్మ వద్ద ఆశ్రయం పొందుతున్నారు. ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెంటనే స్పందించారు.
ఆ చిన్నారుల భవిష్యత్తు కోసం ఎమ్మెల్యే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెద్దమ్మాయిలు కుమారి, జ్ఞానదీప్తిలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆదుకుంటామని, వారికి విద్యావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆ కుటుంబం నివసించడానికి వీలుగా పంచాయతీ పరిధిలో రెండు ప్లాట్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా, చిన్నారి వర్షిణిని బాలసదన్లో చేర్పించి, ఆ పాపను తానే దత్తత తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఆ పాప చదువుతో పాటు అన్ని అవసరాలను తానే దగ్గరుండి చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఆ బిడ్డల భవిష్యత్తుకు భరోసా కల్పించడం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయంపై నియోజకవర్గ ప్రజల నుండి హర్షం వ్యక్తం అవుతోంది.
