రేణిగుంట:
తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో రాత్రివేళ భారీ ప్రమాదం సంభవించింది. రామకృష్ణాపురం సర్కిల్ వద్ద వెళ్తున్న ఒక భారీ లారీ అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది.
చెన్నై నుండి రైల్వేకోడూరుకు వెళ్తున్న 16 చక్రాల భారీ లారీ, రామకృష్ణాపురం సర్కిల్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా రెండు టైర్లు పేలిపోయాయి. దీంతో లారీలో మంటలు చెలరేగాయి. ట్యాంకు నుండి డీజిల్ రోడ్డుపైకి వెదజల్లబడటంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ భీకర దృశ్యాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో లారీని నడుపుతున్న డ్రైవర్ షేక్ ఖాజా హుస్సేన్ (65) అప్రమత్తమై కిందకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది.
ప్రమాదం జరిగిన వెంటనే రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు రేణిగుంట అర్బన్ ఎస్సై ధర్మారెడ్డి మరియు పోలీసుల బృందం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడమే కాకుండా, పోలీసులు అక్కడికి చేరుకుని మంటలు ఇతర వాహనాలకు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఫైటర్లు ప్రాణాలకు తెగించి శ్రమించి, భారీగా ఎగసిపడుతున్న మంటలను చాకచక్యంగా అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.
ఈ ప్రమాదం కారణంగా రేణిగుంట - రైల్వేకోడూరు మార్గంలో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎస్సై ధర్మారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి, వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించారు. మంటలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత రాకపోకలను పునరుద్ధరించారు





