వైభవంగా ఖలీఫా సయ్యద్ ఆరిఫుల్లా సాహెబ్ జన్మదిన వేడుకలు…
ఏర్పేడు మే 2
ఏర్పేడు మండలం అంజిమేడు గ్రామంలోని హాజరత్ మౌలాలి దర్గా పీఠాధిపతులు ఖలీఫా సయ్యద్ ఆరిఫుల్లా సాహెబ్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆధ్యాత్మికతకు, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ క్షేత్రంలో గత 50 ఏళ్లుగా భక్తులకు మార్గదర్శిగా ఉంటున్న సాహెబ్ ని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. కడపకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు హాజరత్ పీరుల్లా మాలిక్ గారి శిష్యులుగా ఆత్మజ్ఞానాన్ని పొందిన వీరు, 74 ఏళ్ల వయస్సులోనూ నిష్కల్మషమైన సేవలు అందిస్తూ వేలాది మంది మురీదులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ వేడుకలో ఎం.ఏ. జబ్బార్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ షేక్ ఫరీద్ బాబా తన కుటుంబ సమేతంగా పాల్గొని సాహెబ్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా నిరుపేదల పట్ల కరుణ చూపే సాహెబ్ సేవలు స్ఫూర్తిదాయకమని, వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. శిష్యులు, ఖలీఫాల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. అంజిమేడు గ్రామం భక్తి పారవశ్యంతో పులకించిపోయింది




