
యాదాద్రి భువనగిరి, మన ధ్యాస ,మార్చి 27:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదని ఆరోపిస్తూ దివ్యాంగులు, వికలాంగుల సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎన్నికల సమయంలో దివ్యాంగులకు రూ.4000 పింఛన్ను రూ.6000కు పెంచుతామని, వృద్ధులు మరియు ఒంటరి మహిళలకు రూ.2000 పింఛన్ను రూ.4000కు పెంచుతామని ప్రకటించినప్పటికీ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా హామీలు అమలు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని, పెన్షన్ను వెంటనే రూ.6000కు పెంచాలని డిమాండ్ చేస్తూ “చలో బస్ భవన్”, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొని తమ హక్కుల కోసం గళమెత్తారు.దివ్యాంగులు వికలాంగుల హెల్పింగ్ సొసైటీ అధ్యక్షుడు మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే హామీలు నెరవేర్చకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతంగా పోరాటం చేపడతామని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.