
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని గున్కుల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులు సభ్యత్వం పొందాలని సహకార సంఘం మానిటరింగ్ అధికారి కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.సభ్యత్వం ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు.సంఘం పరిధిలోని 10 గ్రామాల నుంచి ఇప్పటికే 210 మంది రైతులు సభ్యత్వం పొందినట్లు పేర్కొన్నారు.మిగిలిన రైతులు కూడా సంఘంలో సభ్యులుగా చేరి కమిటీగా ఏర్పడి వ్యవసాయ పరికరాలు, యంత్రాలు మరియు ఆయిల్ ఫామ్ వంటి కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వ 50 శాతం సబ్సిడీ పొందవచ్చని వివరించారు.అలాగే సంఘం ద్వారా రైతులు తమ ఉత్పత్తులను ఆన్లైన్ వేదికలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్లాట్ఫారమ్లలో అమ్ముకునే అవకాశమూ ఉంటుందనితెలిపారు.సభ్యత్వం పొందే రైతులు రూ.2000 చెల్లిస్తే, కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ.2000 సహాయం అందిస్తుందని చెప్పారు.
ఎఫ్పీఓ ద్వారా నిర్వహించే వ్యాపార కార్యకలాపాల్లో సభ్య రైతులకు వాటాలు లభిస్తాయని, వ్యవసాయ యంత్రాలు సబ్సిడీపై అద్దెకు ఇవ్వడం, ఆర్గానిక్ ఫార్మింగ్, స్వంత రైస్ బ్రాండ్ ఏర్పాటుతో పాటు ఇతర వ్యాపార కార్యకలాపాల ద్వారా రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతారని తెలిపారు. సభ్య రైతులకు వారి వాటాలపై ప్రతి సంవత్సరం డివిడెండ్ కూడా అందజేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం సీఈవో రాములు, సిబ్బంది భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.