
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ప్రత్యేకంగా హెల్ప్లైన్ నెంబర్ 8889808182ను ప్రారంభించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,నారాయణపేట జిల్లా పరిధిలో ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు వెంటనే ఈ ప్రత్యేక హెల్ప్లైన్ సెల్ నెంబర్ 8889808182ను సంప్రదించాలని సూచించారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అక్కడుగా వెళ్లే వారు లేదా ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు పై నెంబర్కు కాల్ చేసి సమాచారం ఇవ్వడంతో పాటు, ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు తీసి వాట్సాప్ ద్వారా పంపితే మరింత వేగంగా స్పందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.హెల్ప్లైన్కు అందిన సమాచారాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్లో 24×7 విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది వెంటనే స్వీకరించి, సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్ మరియు పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం అందిస్తారని చెప్పారు. సమాచారం అందిన వెంటనే పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని, రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి, అవసరమైతే వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడే చర్యలు చేపడతారని ఎస్పీ వివరించారు.అలాగే, రోడ్డు ప్రమాద సమాచారం అందించిన వ్యక్తులకు ఎలాంటి వేధింపులు ఉండవని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ గారు స్పష్టం చేశారు. మంచి మనసుతో ప్రమాదానికి గురైన వారికి సహాయం చేసిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, సమాచారం అందించి ప్రాణాలను కాపాడడంలో సహకరించిన వ్యక్తులకు జిల్లా పోలీస్ శాఖ తరఫున ప్రోత్సాహక బహుమతి మరియు ప్రశంసా పత్రం (సర్టిఫికెట్) అందజేయడం జరుగుతుందని తెలిపారు.రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రజల సహకారం అత్యంత కీలకమని, ఒక్క ఫోన్ కాల్తో ఒక విలువైన ప్రాణాన్ని కాపాడవచ్చని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా స్పందించి ఈ హెల్ప్లైన్ను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.