
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- నారాయణపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం డీఎస్పీ నల్లపు లింగయ్య మద్దూరు లో 16 వార్డులకు, కోస్గి లో 16 వార్డులకు సంబంధించిన మున్సిపల్ నామినేషన్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల ప్రజలెవరూ గుంపులు గుంపులుగా ఉండకుండా చూడాలని, పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు.శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తిగా కట్టుబడి ఉందని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమం లో స్థానిక పోలీసులు కోస్గి సీఐ సైదులు, ఎస్సై లు బాలరాజు, విజయ్ కుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.