మన న్యూస్: తిరుపతి, డిసెంబర్ 11 రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ( ఆర్ హెచ్ వి ఎస్ ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా తిరుపతికి చెందిన రుద్రరాజు శ్రీదేవి రాజు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులుగా రిటైర్డ్ ఆర్మీ సిరిగిరి శంకర్ రాజులను నియమించినట్లు ఆ సంస్థ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుకుమార్ రాజు తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో అయోధ్య ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన జాతీయ అధ్యక్షులు రమేష్ చంద్ర ద్వివేది ( రాజు భయ్యా), ప్రధాన కార్యదర్శి నవీన్ చంద్ర శుక్ల లచే నియామకం జరిగినట్లు పేర్కొన్నారు. హిందూ సామ్రాజ్యంలో రామ రాజ్య స్థాపన కోసం, సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మిక భావాలను క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు చేరాలనే సంకల్పంతో శ్రీవారి పాదాల చెంత తిరుపతి నుంచి శ్రీరామ రథయాత్రను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లుపేర్కొన్నారు.పార్టీలకు అతీతంగా రామ రాజ్య స్థాపన ఎజెండాగా ఏర్పాటైన ఆర్ హెచ్ వి ఎస్ వేగవంతంగా అడుగులు వేస్తోందన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్రాజు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ మహా యజ్ఞంలో తమకు భాగస్వామ్యం కలగడం దైవ సంకల్పంగా భావిస్తూ తమ వంతు శక్తివంచన లేకుండా ఆర్ హెచ్ వి ఎస్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా విభాగం శ్రీరామ సేవకులను అతి త్వరలో నియమించనున్నట్లు శ్రీదేవి తెలిపారు. తిరుపతి నుంచి ప్రారంభమయ్యే శ్రీరామ రథయాత్ర విజయవంతానికి ఇప్పటినుంచి ప్రణాళికాబద్దంగా వ్యవహరించి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తమకు ఈ బాధ్యత అప్పగించినందుకు జాతీయ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ చంద్ర దివేది ( రాజు భయ్యా)నవీన్ శుక్ల, దక్షిణ భారతదేశ బాధ్యులు కృష్ణ కిషోర్,ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుకుమార్ రాజు లకు అభినందనలు తెలియజేశారు.