
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్)హైదరాబాద్లో జరిగిన ఉన్నతస్థాయి భేటీలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పరిస్థితులు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపడుతున్న కార్యక్రమాలపై ముఖ్యమంత్రికి వివరించారు.
ఇటీవల నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో ఘన విజయం సాధించి, కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులే ఎన్నిక కావడంపై సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లు డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లాలో పార్టీని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లేలా సమర్థవంతమైన నాయకత్వం అందించాలని సూచించారు.
అలాగే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల రాజకీయ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోందని, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రాధాన్యత మరింత పెరిగిందని జిల్లా నాయకులు, పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు.