మన న్యూస్: భద్రాద్రికొత్తగూడెం జిల్లా,పినపాక మండలం , గోపాలరావుపేట గ్రామ శివారు లో శనివారం నాడు రవి అస్తమిస్తున్న సమయంలో పినపాక తహశీల్దార్ అద్దంకి నరేష్ 128 వ సర్వే నెంబర్ బాపనయ్యకుంట పారకం పరిధిలోని 126.07 ఎకరాల భూమిలో పాతిన ప్రభుత్వ భూమి స్వాధీన హెచ్చరిక బోర్డుతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కిపడ్డ సంఘటన చోటు చేసుకుంది.అకస్మాత్తుగా వచ్చి నవోదయ స్కూల్ నిర్మాణం కొరకు ఆక్రమించు కుంటున్నామంటూ బోర్డు పెట్టడంతో రోడ్డున పాలయిన రైతులు.గత 60 సంవత్సరాలుగా ఈ భూమిలో దాదాపు 100 మంది రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారాన్ని పొందుతున్నారు. ఇప్పుడు ఈ భూమిని అకస్మాత్తుగా ప్రభుత్వ భూమిగా ప్రకటించి, స్కూల్ నిర్మాణం కోసం తీసుకోవడంపై గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, నవోదయ స్కూల్ పినపాక మండలానికి రావడం నిజంగా హర్షించదగిన విషయం. కానీ, రైతుల భూములు లాక్కుని స్కూల్ నిర్మిస్తామని చెప్పడం మాకు అన్యాయంగా అనిపిస్తోంది. ఖాళీ స్థలం ఎక్కడా దొరకలేదా? మా జీవనాధారమైన పొలాలను తీసుకుంటే, మా బ్రతుకులు వీధిన పడతాయి. మాకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా తయారవుతుంది, అన్నారు. రైతులు ప్రశ్నించారు, పొడు భూములకే ప్రభుత్వం పట్టాలు ఇస్తుంటే, మా పంట పొలాలకు పట్టాలు ఎందుకు ఇవ్వకూడదు? మా భూములను ప్రభుత్వ భూమిగా మార్చడాన్ని మేము ఒప్పుకోలేము. గ్రామంలో ఖాళీ స్థలంలో స్కూల్ నిర్మిస్తే మేము కూడా హర్షిస్తాం. కానీ మా పొలాలను తీసుకోవడం పూర్తిగా అన్యాయం. రైతులు వారి బాధను వివరించుతూ, ఈ భూములపై మా మూడు తరాలుగా ఆధారపడి జీవనం సాగిస్తున్నాము . ఇప్పుడు ఈ భూములు లేకపోతే, మేము మరో చోట కొనుగోలు చేసుకునే సామర్థ్యం కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం మరొకసారి ఆలోచించి మా భూముల జోలికి రాకుండా కాపాడాలి, అని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారం గ్రామ ప్రజలందరికీ ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి, రైతుల ఆకాంక్షలను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని, రైతుల పంట భూములకు పట్టాలు ఇచ్చి వారి జీవన విధానాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.