


మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ ప్రాజెక్ట్ మన వారసత్వ సంపద అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నిజాంసాగర్ మండలంలోని నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని ఆమె గురువారం సందర్శించి పనులను పర్యవేక్షించారు.రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కవిత విలేకరులతో మాట్లాడుతూ..రైతులు తమ భూములను కోల్పోయి తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ప్రభుత్వం ఎకరానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. లేకుంటే ఒక ఎకరం పోయిన వారికి మరోచోట ఒక ఎకరం భూమిని కేటాయించే విధంగా చూడాలి’అని చెప్పారు.జుక్కల్ నియోజకవర్గంలో సుమారు 40 వేల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో 476 కోట్లతో ఈ లిఫ్ట్ పథకాన్ని ప్లాన్ చేశారు. అయితే, పంప్ హౌస్కు కావాల్సిన 12 ఎకరాలు మినహా, మిగిలిన 200 ఎకరాల భూమి సేకరణ జరగలేదు.కరకట్ట, చెక్ డ్యామ్ కోసం గుంట భూమిని కూడా సేకరించకుండా రాళ్లు అడ్డం పెట్టి నిర్మాణాలను మొదలు పెట్టారని దుయ్యబట్టారు. దీంతో మూడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, తమకు నీళ్లు వస్తాయో రావోనని ప్రజలు భయపడుతున్నారని తెలిపారు.నిజాం ప్రభుత్వం కాలంలో నిజాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన చీఫ్ ఇంజనీర్ నవాజ్ అలీ జంగ్ బహదూర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.1923లో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్ట్ వందేళ్లు పూర్తి చేసుకున్నా, దాని నిర్వహణలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని కవిత విమర్శించారు.జుక్కల్ నియోజకవర్గంలో ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ బాన్సువాడలో 60 వేల ఎకరాలు నీటిని అందిస్తోందని ఆమె గుర్తుచేశారు.మూడుకిలోమీటర్ల వరకు మూడు గేట్లతో అత్యంత అద్భుతంగా నిజాం సాగర్ నిర్మించబడ్డది.కానీ ప్రాజెక్ట్లో సగానికి సమానంగా మట్టి పేరుకుపోవడంతో అసలు సామర్థ్యం దెబ్బతిన్నది’ అని వివరించారు.1972లో ఒక్కసారే రిపేర్ చేయడం వల్ల కెపాసిటీ 30 టీఎంసీలకు చేరిందని,తర్వాత మట్టిపూడిక పెరగడంతో 11 టీఎంసీలకు పడిపోయి, ప్రస్తుతం 17 టీఎంసీలే ఉందని తెలిపారు.వర్షాకాలంలో నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని,వచ్చిన నీళ్లను వచ్చినట్లే గేట్లు ఎత్తి పంపించాల్సి వస్తోందని తెలిపారు.ఈ ప్రాజెక్ట్కు విస్తరణగా నిర్మించిన అలీసాగర్ కూడా ఆశించిన ప్రయోజనం అందించలేకపోతుందన్నారు.మూడులక్షల ఎకరాలు సేద్యానికి నీళ్లు అందాల్సి ఉండగా,అన్ని ఎకరాలకు నీళ్లు చేరడం లేదు.కాంగ్రెస్ ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల్లో మట్టిపూడిక తొలగింపు పనులను ప్రాధాన్యతగా తీసుకుంటోంది అని ఆమె చెప్పారు.
నిజాంసాగర్లో పేరుకుపోయిన మట్టిని అత్యవసరంగా తొలగించాలని,ఆ మట్టిని కమర్షియల్గా కాకుండా రైతులకు ఉచితంగా ఇవ్వాలని,గ్రామాలను బలోపేతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన డీపీఆర్ను ప్రభుత్వం వెంటనే తయారు చేయాలని కోరారు.మట్టిపూడిక కారణంగా ఎల్లారెడ్డిపేట పరిసర గ్రామాలు మునిగిపోతుండటం, ఇటీవల వర్షాల్లో బ్యాక్వాటర్ మెదక్ జిల్లాలోని పాపన్నపేట వరకు చేరటం ఆందోళనకరమని ఆమె పేర్కొన్నారు. బ్యాక్వాటర్ వల్ల దాదాపు 4 వేల ఎకరాల పంటలు నష్టపోయినా ప్రభుత్వం స్పందించడం లేదని కవిత విమర్శించారు.మన వారసత్వ ప్రాజెక్ట్ను కాపాడి భవిష్యత్ తరాలకు అందించడం ప్రభుత్వ బాధ్యత.వెంటనే మట్టిపూడిక తొలగింపుతో పాటు మోడర్నైజేషన్ పనులు చేపట్టాలి.నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి అని ఆమె డిమాండ్ చేశారు.ఆమె వెంట జిల్లా జాగృతి అధ్యక్షులు సంపత్ గౌడ్, జుక్కల్ నియోజకవర్గం ఇన్చార్జ్ గోటేకి రాజశేఖర్, జుక్కల్ జాగృతి ఇన్చార్జ్ ఆదిల్, నరేష్ గౌడ్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు

