మన న్యూస్: పినపాక, దాదాపుగా మూడు సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం హడావిడిగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరుచేసింది. అసంపూర్తి నిర్మాణాలతో పేద ప్రజలను అయోమయానికి గురిచేసింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఆశించిన ప్రజలు అర్ధాశలతో పూర్తి నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళితే…
కరకగూడెం మండలం, కన్నాయిగూడెం గ్రామపంచాయతి, బంగారుగూడెం గ్రామంలో 2022లో 20 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసింది అప్పటి ప్రభుత్వం. కాంట్రాక్టు పొందిన సదరు కాంట్రాక్టర్ సగం వరకు పూర్తి చేసి చేతులు దులిపేసుకున్నాడు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం తీసుకొచ్చిన మెటీరియల్ ఇసుక, ఇటుక, ఐరన్, సిమెంట్ వంటి వాటిని ఇటీవల కాంట్రాక్టర్ వేరే చోటికి తరలిస్తున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు బంగారుగూడెం గ్రామస్తులందరూ పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ను కలిసి వినతి పత్రం అందజేశారు. అసంపూర్ణంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసి పేదల కళలను నెరవేర్చాలని ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు విన్నవించినట్లు తెలిపారు. బంగారుగూడెం గ్రామస్తులు శిధిలమైన ఇళ్ళల్లో నివసిస్తూ భయం భయంగా జీవిస్తున్నారని తెలిపారు .కొన్ని ఇండ్లు నేలమట్టమయి ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బంగారుగూడెం గ్రామాన్ని సందర్శించి తప్పకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు .ఎమ్మెల్యేని కలిసిన వారిలో ఆధార్ సంస్థ వ్యవస్థాపకులు తోలెం రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడెం నాగేశ్వరరావు, కోడెం రామారావు ,పూనెం విష్ణుమూర్తి ,బంగారు రామయ్య , కోడెం సత్యవతి, కోడెం గంగ,గొగ్గెలి మాణిక్యం, గొగ్గెలి రాధ ,తదితరులు పాల్గొన్నారు.