మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) వందేండ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్ పర్యాటకానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటక ప్రమోషన్ లో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు నిజాంసాగర్ ప్రాజెక్టు ను సందర్శించారు. ఈ..నిజాంసాగర్లో ప్రాచీన కట్టడాలైన, గోల్ బంగ్లా, గుల్గస్త్ బంగ్లా, వీఐపీ గార్డెన్, స్విమ్మింగ్ పూల్ కట్టడాలను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో కలిసి పరిశీలించారు. పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను సంబంధిత అధికారులతో ఆయన చర్చించారు. నిజాంసాగర్ జాలాశాయంతో పాటు పరిసరాల ప్రాంతాల అభివృద్ధికి 12 ఎకరాల స్థలాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థకు రెవిన్యూ శాఖ అప్పగించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు జలాశయంలో ఆహ్లాదం కోసం బోటింగ్, జలాశయం దిగువన కాటేజీలు, ఉద్యానవనం, చిన్న పిల్లల పార్కు సౌకర్యాలు అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆయన సూచించారు. అనంతరం నిజాసాగర్ హెడ్ లుస్ పవర్ స్టేషన్ ను సందర్శించారు. మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల వర ప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు పర్యాటక ప్రదేశాలు అద్భుతంగా ఉందని, వందేండ్లు గడిచిన చెక్కుచెదరలేదని ఆయన అన్నారు. మూడు కాలాలు ఎప్పడు నిండుకుండలా ఉన్న నిజాంసాగర్ జలాశయం పర్యాటక అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు.ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు త్వరలోనే నూతన పర్యాటక పాలసీ అమల్లోకి తెస్తామని వెల్లడించారు. నిజాంసాగర్ హైడ్ లుస్ పవర్ స్టేషన్ లో 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని, త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తో చర్చించి, దీన్ని పూర్తిగా ఆధునికరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మి కాంతారావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్, మండల రెవెన్యూ అధికారి బిక్షపతి, పిట్లం వ్యవసాయ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్, నిజాంసాగర్ మండలం అధ్యక్షులు మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, పర్యాటక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.