
నెల్లూరులో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ
మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 23:ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో అధికారులు ఎలాంటి వాతావరణ పరిస్థితులునైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు గోమతి నగర్ మంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై అధికారులతో సమావేశం నిర్వహించారు. వర్షాలు విపరీతంగా కురుస్తున్న కారణంగా చేపట్టాల్సిన చర్యల గురించి దిశ నిర్దేశం చేశారు. వర్షపు నీరు సులువుగా ప్రవహించేలా తగిన ఏర్పాట్లు చేపట్టాలని, ఈ క్రమంలో కాలువలపై ఆక్రమణలు ఏమన్నా ఉంటే వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. పలు అంశాలపై మంత్రికి అధికారులు విన్నవించారు. చేపడుతున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ మాట్లాడుతూ.....గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరులో అత్యధికంగా 146.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. వర్షాల క్రమంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అయితే కాలువల్లో పూడికతీత పనులు చేయడం వల్ల నెల్లూరు కార్పొరేషన్ లో ఎక్కడా నీరు నిలవడం లేదన్నారు. అదేవిధంగా 123 మున్సిపాల్టీల్లో రూ.50 కోట్లతో పూడిక తీత పనులు చేపట్టామని తెలిపారు. నెల్లూరు సిటీలో 47 పార్కులను అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం రూ.165 కోట్లు విడుదల చేశారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. దగదర్తిలో ఎయిర్పోర్ట్ కు త్వరలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారన్నారు. అలాగే కోవూరు సుగర్ ఫ్యాక్టరీ దగ్గర పరిశ్రమ ఏర్పాటు చేసి వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. నెల్లూరును మంచి మోడల్ సిటీగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. కొద్ది రోజులు ఓపిక పడితే ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరి చేస్తున్నామని, గత ప్రభుత్వం ప్రజలకు అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎల్ ఆర్ ఎస్ , బి ఆర్ ఎస్ తీసుకొచ్చామని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కావలికి టౌన్ ప్లానింగ్ వాళ్ళు వెళ్ళి పరిశీలిస్తే రాజకీయ రంగు పులుముతున్నారని తెలిపారు. నెల్లూరులో 3 అంతస్తులకు అనుమతులు తీసుకుని 7 అంతస్తులు కడితే వాటిని కూల్చేశామని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కడితే కూల్చడం ఖాయమన్నారు. పంట కాలువలను చాలా మంది ఆక్రమించారని, అలాంటి ఆక్రమాలలో వెంటనే తొలగించాలంటూ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.