
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శనివారం ప్రాజెక్టు ద్వారా 15 వరద గేట్లను ఎత్తి దిగువకు 1,09,470 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి పారుదల శాఖ ఏఈలు అక్షయ్, సాకేత్ తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ప్రాజెక్టులోకి 96 వేల 057 ఇన్ ఫ్లో గా వచ్చి చేరుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1401.42 అడుగుల (12.978 టీఎంసీలు) నీరు నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు 15 వరద గేట్లు ఎత్తివేసి 1,09,057 క్యూసెక్కుల వరద నీటిని మంజీరా నది లోకి, ప్రధాన కాలువ ద్వారా 1250 క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు విడుదల చేస్తున్నట్లు ఏఈలు తెలిపారు. అదేవిధంగా వర్షాభావంతో వాగులు, వంకలు కూడా వరద నీటితో ప్రవహిస్తున్నందున ప్రజలు, రైతులు, పశువుల, గొర్రెల కాపరులు మంజీరా నది వైపు వెళ్లే నీటి ప్రవాహంలోకి కాలువలలోకి దిగరాదని అప్రమత్తంగా ఉండాలని కోరారు. పర్యాటకులు ప్రాజెక్టు అందాలను తిలకించే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద గేట్ల నీటి ప్రవాహం దగ్గరకు గాని, లోతట్టు ప్రాంతాల వైపు ఎవరు వెళ్లకూడదని పర్యాటకులకు సూచించారు.
