
మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) మహమ్మద్నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో గురువారం గ్రామ పెద్దల సమక్షంలో ప్రత్యేక సమావేశం జరిగింది.గ్రామ ప్రజల ఆరోగ్యం, కుటుంబాల శాంతి,సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని గ్రామంలో మద్యం విక్రయాన్ని పూర్తిగా నిషేధించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ –మద్యం అమ్మిన వారికి లక్ష రూపాయల జరిమానా విధిస్తాం అని స్పష్టంచేశారు.మద్యం విక్రయిస్తున్నారని ఎవరు సమాచారం ఇస్తే వారికి 20 వేల రూపాయల బహుమతి అందజేస్తామని తీర్మానం చేశారు.
గ్రామంలోని యువత భవిష్యత్తు చెడిపోకుండా, కుటుంబాల్లో శాంతి నెలకొనాలని,గ్రామం సంపూర్ణంగా మద్యపాన వ్యసనాల నుండి విముక్తి పొందాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెద్దలు తెలిపారు.గ్రామంలో మద్యపాన నిషేధాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు.ఈ నిర్ణయం వలన బూర్గుల్ గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.