

మనధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్ 20:తెలంగాణ ఆత్మ, ఆభరణమైన బతుకమ్మ పండుగను నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వఉన్నతపాఠశాల,మల్లూర్,మోడల్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ కలసి పూల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల వస్త్రధారణలో తీరక పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. పాఠశాల ఆవరణలో బతుకమ్మలను వుంచి “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో” అంటూ ఆడిపాడుతూ, తాళాలు వేసుకుంటూ,తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించారు. ఆడపడుచుల జాతరలా పాఠశాల ఆవరణ కిక్కిరిసిపోయింది.
ప్రిన్సిపాల్ కార్తిక సంధ్య మాట్లాడుతూ – మన సంస్కృతి, సంప్రదాయాలు తరతరాలకు చేరాలంటే ఇలాంటి పండుగలను పాఠశాలల్లో పిల్లలతో కలసి జరుపుకోవడం చాలా ముఖ్యం.బతుకమ్మ పండుగ తెలంగాణ గర్వకారణంఅని పేర్కొన్నారు.విద్యార్థులు మాట్లాడుతూ - బతుకమ్మ పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందని,పూలను సేకరించడం నుండి పేర్చడం వరకు ప్రతి ప్రక్రియలో సంతోషంగాభాగస్వాములమయ్యామని తెలిపారు.ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి ఆటలు ఆడి, పాటలు పాడి ఆనందించారు.తరువాత సంప్రదాయబద్ధంగా బతుకమ్మ నిమజ్జనం జరిపారు. కార్యక్రమంలోఉపాధ్యాయులు, విద్యార్థులు,సిబ్బంది అందరూ పాల్గొని పండుగ వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటేశం,రక్షణ,తదితరులు ఉన్నారు.

