
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్ 19 :
వర్షాకాలంలో ఎక్కువగా ప్రబలే సీజనల్ వ్యాధుల బారిన ప్రజలు పడకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని మహ్మద్ నగర్ మండల ప్రత్యేకాధికారి అరుణ సూచించారు. శుక్రవారం ఆమె మండలంలోని పలు కాలనీలలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – వర్షపు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఇళ్ల చుట్టుపక్కల నీటి నిల్వలను ప్రతి శుక్రవారం తొలగించే అలవాటు చేసుకోవాలని సూచించారు. దోమల వల్ల మలేరియా,డెంగీ వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణ కోసం చేపడుతున్న ‘ఫ్రైడే డ్రైడే’ కార్యక్రమంలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు.అలాగే శుభ్రత పాటించడం, స్వచ్ఛమైన తాగునీరు వినియోగించడం,పిల్లలు, వృద్ధులు,గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని ప్రజలను హెచ్చరించారు.ఆమె వెంట ఎంపీడీవో అనితా,పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ సింగ్,వైద్య శాఖ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.