వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పులివెందుల పర్యటన, క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్భార్
వైఎస్సార్సీపీ శ్రేణులకు శ్రీ వైయస్ జగన్ భరోసా
క్యాంప్ కార్యాలయంలో ప్రజలతో మమేకం
పులివెందుల/మన ద్యాస న్యూస్ :////
పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్… కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వైయస్ జగన్ వద్ద వాపోయారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క పోలీసు వ్యవస్థనే కాకుండా అన్ని వ్యవస్థలను ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని వైయస్ జగన్ మండిపడ్డారు. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలిగానీ.. కీడు చేయకూడదన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, పార్టీ అని చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేశామని వైయస్ జగన్ గుర్తు చేశారు. టీడీపీ కూటమి సర్కార్ ప్రజలకు మేలు చేయడం పక్కనపెట్టి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు వైయస్ జగన్ సూచించారు.