శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:-
చిన్ని కృష్ణుడు, చిలిపి కృష్ణుడు, గోపాలకృష్ణుడు అంటూ ముద్దుగా అనేక పేర్లతో సంబోధించే శ్రీకృష్ణుడు పుట్టిన రోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇది విష్ణువు ఎనిమిదవ అవతారమైన కృష్ణుడి జననాన్ని జరుపుకునే వార్షిక హిందూ పండుగ. గీత గోవిందం వంటి కొన్ని హిందూ గ్రంథాల్లో, కృష్ణుడిని సర్వోన్నత దేవుడిగా, అన్ని అవతారాలకు మూలంగా గుర్తించిన కృష్ణుడి జననాన్ని శ్రావణ మాసంలో (అమంత సంప్రదాయం ప్రకారం) చీకటి పక్షంలోని ఎనిమిదవ రోజు (అష్టమి)నా నేటి శనివారం ఈ వేడుకలను కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఘనంగా ఆచరించారు. శంఖవరం మండలంలోని వివిధ గ్రామాల్లోని కృష్ణాలయాల్లో శనివారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్నవరం రత్నగిరి శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కొండపైన వేద పురోహిత పండితులు వేద మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి పూజలను ఘనంగా నిర్వహించారు. కత్తిపూడిలో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని శ్రీ వేణుమాధవ స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సుందరంగా అలంకరించిన వేదికపై స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి పూజలు నిర్వహించారు. పూజల్లో భాగంగా ఆలయ చైర్మన్ కేళంగి నూకరాజు, అమ్మాజీ దంపతుల ఆధ్వర్యంలో పురోహితులు వేమకోటి త్రినాథ్ శర్మ సత్యనారాయణ శర్మలు వేద మంత్రోచ్ఛారణల మధ్య కేళంగి కృష్ణమూర్తి, సుబ్బలక్ష్మి, కేళంగి పేర్రాజు, నాగజ్యోతి, కేళంగి హరినాథ్, రఘువాణి దంపతుల చేతుల మీదుగా విగ్నేశ్వర పూజ, శుద్ధి పుణ్యాహ వాచనం, మండపారాధన, నవగ్రహారాధన, శ్రీ సూక్తం, పురుష సూక్తం, రుద్ర నమకం చమకం, అష్టోత్తర శతనామంతో పాటు స్వామి వారికి పంచామృత అభిషేకం గావించారు. అనంతరం మంత్రపుష్ప నీరాజనం నిర్వహించారు. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. స్వామిని నూతన పట్టు వస్త్రాలు, వివిధ జాతుల పుష్పమాలలతో అలంకరించారు. స్వామి వారు దేదీప్యమానంగా దర్శనమిచ్చరు. అనంతరం పలువురు చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణలో వచ్చి స్వామి వారిని దర్శించు కున్నారు. గ్రామంలోని నాలు కృష్ణాలయాల్లోనూ శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉట్లోత్సవాల కార్యక్రమాల్లో యువతీ, యువకులు, పెద్దలు పోటీ పడి మరీ పాల్గొన్నారు. మండల కేంద్రం శంఖవరం యాదవ కాలనీలోని శ్రీ కృష్ణాలయంలో కూడా ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయాల ప్రాంగణాలు, దారి పొడవునా విద్యుత్తు దీపాల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.