మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ నియోజక వర్గ కేంద్రంలోని ప్రభుత్వ సీ హెచ్ సీ ( సామాజిక ఆరోగ్య కేంద్రం) ని బుధవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ప్రసూతి గది, స్కానింగ్, ల్యాబ్, డయాలసిసి సెంటర్,జనరల్ వార్డు, డ్రగ్స్ స్టోర్ ను ఆమె పరిశీలించారు. ఆస్పత్రిలో నెలకు ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ల్యాబ్ కు వెళ్లిన కలెక్టర్ అక్కడ రోజుకు ఎన్ని రక్త పరీక్షలు, ఎలాంటి పరీక్షలు చేస్తున్నారని, టీబీ నిర్ధారణ పరీక్షలు ఎంత మందికి చేస్తున్నారని, టీబీ కోసం సేకరించిన నమూనాలకు ఎక్కడ స్టోర్ చేస్తున్నారని, చేసిన పరీక్షల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారా? లేదా? అని ప్రశ్నించారు. డయాలసిస్ సెంటర్ లోకి వెళ్ళి ఎన్ని బెడ్స్ ఉన్నాయని, ఎంతమంది డయాలసిస్ చేసుకుంటున్నారనే వివరాలను తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేయించాలని, మరుగు దొడ్ల తలుపులను మరమ్మతు చేయించాలని మున్సిపల్ కమిషనర్ శంకర్ కు సూచించారు. అనంతరం జనరల్ వార్డుకి వెళ్ళి రోగులతో వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఓపీ విభాగానికి వెళ్లి రోజుకు ఎంత మంది అవుట్ పేషంట్స్ వస్తుంటారని అక్కడి వైద్య సిబ్బందిని ప్రశ్నించగా 200 నుంచి 300 మంది దాకా అవుట్ పేషంట్స్ వస్తుంటారని సిబ్బంది కలెక్టర్ కు తెలిపారు. ఆస్పత్రిలో నమోదు అవుతున్న సీజనల్ వ్యాధుల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ కేసులేమీ లేవు కదా అని ప్రశ్నించగా ఇప్పటిదాకా వైరల్ ఫీవర్ కేసులే ఎక్కువగా నమోదు అయ్యాయని సిబ్బంది తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం అన్నారు. చివరగా డ్రగ్స్ స్టోర్ కి వెళ్ళి నిల్వ ఉన్న మందులను పరిశీలించారు. డ్రగ్స్ కాల పరిమితి ఎలా తెలుస్తుందని డ్రగ్స్ స్టోర్ ఫార్మాసిస్టు ను అడగడంతో డ్రగ్స్ వచ్చినప్పుడు తాము రిజిస్టర్ తో పాటు కంప్యూటర్ లోనూ నమోదు చేస్తామని, మందుల నిల్వ ను బట్టి కాల పరిమితి ముగిసిన వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని ఫార్మాసిస్టు కలెక్టర్ కు తెలిపారు.