మన న్యూస్ సాలూరు రూరల్, ఆగస్టు 10:- పార్వతిపురం మన్యం జిల్లా,కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో నిర్మిస్తున్న, నిర్మించిన ఏకలవ్య భావనాల నాణ్యతను విజిలెన్స్ అధికారులు పరిశీలించాలని, గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని గిరిజన ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగు మహేశ్వర రావు అన్నారు. ఆదివారం ఉదయం విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 35కోట్లతో పనులు చేపట్టిన గుత్తేదారు కృష్ణంరాజు నుండి ఈఎన్సీ శ్రీనివాసరావు ఐదు కోట్ల 50లక్షల రూపాయిలను పర్శంటేజీల రూపంలో డిమాండు చెయ్యడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంట్రాక్టు పనుల్లో పర్శంటేజీలనేవి సర్వ సాధారణం కాగా, ఈ స్థాయిలో డిమాండ్ చెయ్యటం వెనుక బలమైన కారణం ఉండి ఉండవచ్చన్నారు. పనుల నాణ్యతా, ప్రమాణాల విషయంలో ఇరువురు రాజీ పడి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేసారు. కావున కాంట్రాక్టర్ కృష్ణం రాజు చేపట్టిన ఏకలవ్య పనుల బిల్లులు చెల్లించక ముందే, వీటిపై విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టి పనుల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాలన్నారు. అంతేకాకుండా త్వరలో రిటైర్ కావల్సిన వ్యక్తికి మరో రెండేళ్ల పాటు అతని ఉద్యోగ కాలాన్ని పొడిగించేందుకు ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫారసు వెనుక భారీ మొత్తం చేతులు మారి ఉండవచ్చన్నారు. అంతకు ముందు ఈఎన్సీ పై ఉన్న అవినీతి, విజిలెన్స్, ఏసీబీ కేసులను కొట్టేస్తూ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడం వెనక గల కారణాలను పరిశిలించాలన్నారు. అంతేకాకుండా ఈఎన్సీ గత రెండు నెలలుగా ఎవరితో మాట్లాడారు, ఎంత సమయం మాట్లాడారో పరిశీలిస్తే ఆయన వెనుక ఉన్న పెద్ద మనుష్యులు వెలుగులోకి వస్తారన్నారు. కావున కూటమి ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే తమ నేతల ఒత్తిడికి తలొగ్గకుండా ఈఎన్సీ కాల్ డేటాను పరిశీలించాలన్నారు. గిరిజన విద్యార్థుల చదువు కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నదని, కావున వాటిని సక్రమంగా ఖర్చు పెట్టించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.